హర్యానాలోని పంచకుల జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తన ఇన్స్టాగ్రామ్ స్నేహితురాలితో స్వేచ్ఛగా గడపడానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో, ఒక ఆటో డ్రైవర్ ఏడాది వయసున్న పసికందును అత్యంత పాశవికంగా అంతమొందించాడు.
నిందితుడు అజయ్, క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రం) వద్దకు వెళ్లి తానే ఆ బాబు తండ్రినని నమ్మించి కిడ్నాప్ చేసి, ఆపై గొంతు నులిమి చంపేశాడు. ఆదివారం (జనవరి 25) నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడు చేసిన ఒళ్లు గగుర్పొడిచే నేరాన్ని మీడియాకు వెల్లడించారు.
హత్యకు దారితీసిన అసూయ
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు అజయ్కు ఆ బాబు తల్లితో ఆరు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అయితే, ఆమెకు ఉన్న ఏడాది బాబు తన స్నేహానికి అడ్డుగా మారుతున్నాడని అజయ్ భావించాడు.
ఆ బాబుపై విపరీతమైన ద్వేషం పెంచుకున్న అతడు, ఎలాగైనా పసివాడిని వదిలించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే శనివారం నాడు బాబును ఉంచిన క్రెచ్కు వెళ్లి, సిబ్బందిని బురిడీ కొట్టించి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఆపై ఊపిరాడకుండా చేసి చంపేసి, మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
నిందితుడి నేర అంగీకారం
తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు.
“ఆ బాబు ఉన్నంత కాలం నేను ఆమెతో స్వేచ్ఛగా ఉండలేనని అనిపించింది, అందుకే చంపేశాను” అని నిందితుడు చెప్పిన మాటలు విని పోలీసులు సైతం నివ్వెరపోయారు.
మరోవైపు, తండ్రి ఎవరో సరిగా ధృవీకరించుకోకుండానే పసివాడిని గుర్తుతెలియని వ్యక్తికి అప్పగించిన క్రెచ్ యాజమాన్యం తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిపై హత్య మరియు కిడ్నాప్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.