అఫ్గానిస్థాన్లో ప్రకృతి ప్రకోపం: మెరుపు వరదలకు 17 మంది బలి!
అఫ్గానిస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమపాతం ధాటికి సంభవించిన ఆకస్మిక వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి. అలాగే 17 మందికి బలిగొన్నాయి.
దీర్ఘకాలిక కరువు తర్వాత అఫ్గానిస్థాన్ను ముంచెత్తిన సీజన్లోని మొదటి భారీ వర్షాలు, హిమపాతం పెను విషాదాన్ని మిగిల్చాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రావిన్సుల్లో సంభవించిన మెరుపు వరదల (Flash Floods) కారణంగా ఇప్పటివరకు కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్లోని కబ్కాన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు, వారు నివసిస్తున్న ఇంటి పైకప్పు కూలి మరణించడం స్థానికులను కలచివేసింది. ఈ మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అఫ్గాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రకారం, దాదాపు 1,800 కుటుంబాలు ఈ ప్రకృతి విపత్తు వల్ల నిరాశ్రయులయ్యారు.
సెంట్రల్, ఉత్తర, దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు పాక్షికంగాను, కొన్ని పూర్తిగా ధ్వంసం కాగా, మారుమూల ప్రాంతాల్లోని మట్టి ఇళ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి, వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశ ప్రజలకు ఈ వరదలు పులిమీద పుట్రలా మారాయి. అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దించి, బాధితులకు ఆహారం మరియు అత్యవసర సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.
పెరిగిన మానవీయ సంక్షోభం: సాయం కోసం ఎదురుచూపు
అఫ్గానిస్థాన్లో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అంతర్గత సంఘర్షణలు, బలహీనమైన మౌలిక సదుపాయాలు మరియు వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు భారీ ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు 2026లో అఫ్గానిస్థాన్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్న దేశాల్లో ఒకటిగా ఉంటుందని ఇప్పటికే హెచ్చరించాయి. సుమారు 1.8 కోట్ల మంది ప్రజలకు తక్షణ సహాయం అవసరమని ఐరాస అంచనా వేసింది. దీనికోసం సుమారు 1.7 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వేలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ హిమపాతం కారణంగా కొన్ని మారుమూల గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. అక్కడి ప్రజలకు ప్రాథమిక వైద్య సదుపాయాలు అందించడం కూడా కష్టంగా మారింది. అఫ్గాన్ ప్రజలను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో స్పందించాలని ఐరాస కోరుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
#Afghanistan #FlashFloods #ClimateChange #InternationalNews #HumanitarianAid

