- టూరిజంకు పారిశ్రామిక హోదా
ఏపిలో పర్యాటకరంగానికి పెద్ద పీటవేస్తామని టూరిజం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంటుందన్నారు. సినిమా పరిశ్రమకు విశాఖ అనుకూలమైన ప్రదేశమని తెలిపారు. సినిమాల చిత్రీకరణకు సింగిల్ విండో సిస్టం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
శుక్రవారం జరిగిన సీఐఐ టూరిజం అండ్ ట్రావెల్స్ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, టూరిజంకు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండ భవనాలను ఏం చేయాలో అన్నదానిపై నెల రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. ఈసారి బీచ్ పెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని టూరిజం సంస్ధలు ఈ ఫెస్టివల్స్ కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ ఎపికి తరలి రావాలని పిలుపు ఇచ్చారు.
మాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం: నిర్మాత సురేష్
సినీ పరిశ్రమ విశాఖకు రావడం కంటే ఇక్కడ లోకల్ టాలెంట్ను పోత్సాహించడం అవసరమని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. సినిమా తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నారు. ఎక్కడ నుంచైనా సినిమా తీయవచ్చని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం సినిమా మీద విపరితంగా ఉందన్నారు. చైన్నై నుంచి హైదరాబాద్కు అతికష్టం మీద తరలివచ్చామని చెప్పారు.
ఇప్పుడు తమకు రెండు రాష్ట్రాలు ముఖ్యమని స్పష్టం చేశారు. మనం తీసేది తెలుగు సినిమా కాబట్టి ఎక్కడ తీసిన ఒక్కటే అని .. అక్కడ ఇక్కడ ఉన్నది తెలుగు వాళ్లే అని అన్నారు. సిని టూరిజాన్ని అభివృద్ది చేయాలన్నారు. మనకు చాల వనరులు ఉన్నప్పటికీ వచ్చే టూరిస్టులు మాత్రం తక్కువన్నారు. ఫ్రెండ్లీ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. కట్టడి లేకుండా టూరిస్టులుకు స్వేచ్ఛ ఇవ్వాలని.. అప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని నిర్మాత సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.