
వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అనంతరం, మహిళలు చేపట్టిన శాంతియుత నిరసనపై వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు.
“నిరసన తెలిపిన మహిళల్ని ‘సంకరజాతి’ అని కించపరచడం దారుణం. ఇది ఎంత చెత్త దృష్టికోణమో చూపుతుంది. ఏం భాష ఇది? ఇది ఏ విధమైన సంస్కృతి?” అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు, సాక్షి టీవీకి చెందిన జర్నలిస్టులు మహిళలపై దిగజారిన వ్యాఖ్యలు చేస్తూ తక్కువ చూపు చూస్తున్నారని మండిపడ్డారు. “తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళల్ని ‘వేశ్యలు’ అన్నారని, ఇప్పుడు ‘సంకరజాతి’ అంటున్నారని” ఆయన వేదన వ్యక్తం చేశారు.
వైసీపీ వైఖరి నేత జగన్ తన తల్లి, చెల్లిని తూర్పారబోసిన తీరుతో పోల్చదగినదిగా పేర్కొన్నారు. “మహిళల గౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉంది. మహిళలపై దూషణలను సహించం” అని స్పష్టం చేశారు.
ఇటీవల సాక్షి టీవీలో ప్రసారమైన డిబేట్లో ఒక జర్నలిస్టు “అమరావతి చుట్టు పక్కల సెక్స్ వర్కర్లు ఎక్కువ అనే మాటలను వాడారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై పోలీసులు సాక్షి ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామక్రిష్ణా రెడ్డి కొందరు సంకర వర్గం ఈ నిరసనలను ప్రేరేపిస్తున్నారని అన్నారు. దానిపై మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు.