
అమరావతి: అమరావతిని “క్వాంటమ్ వ్యాలీ”గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిలికాన్ వ్యాలీ (Silicon Valley) తరహాలో క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) రూపొందాలని, దీని కోసం ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో, ఐటీ నిపుణులతో కలిసి ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ (AP State Quantum Mission) ప్రణాళికలను పరిశీలించిన సీఎం, ఈ నెల 30న విజయవాడలో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ భవనం ఐకానిక్ (Iconic)గా ఉండాలని, హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో ప్రత్యేక గుర్తింపు పొందాలన్నారు.
రూ.4,000 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి
సమీక్షలో అధికారులు క్వాంటమ్ మిషన్ విధానం (Policy), కార్యాచరణ ప్రణాళిక (Action Plan) వివరించారు. ఈ మిషన్లో క్వాంటమ్ కంప్యూటింగ్ (Quantum Computing), క్వాంటమ్ కమ్యూనికేషన్, సెన్సింగ్-మెట్రాలజీ, మెటీరియల్స్-డివైజ్లు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతారు. 2025-27 మధ్య మొదటి దశ, 2027-2030 మధ్య రెండో దశ చేపట్టనున్నారు.
మొదటి దశలో మౌలిక వసతులు, విద్య, పరిశోధన, పైలెట్ ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించనున్నారు. రెండో దశలో వాణిజ్య పరంగా ఏపీని గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దే లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో రూ.4,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. క్వాంటమ్ ఆధారిత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెలకొల్పడంలో ఏపీను పైలెట్ రాష్ట్రంగా ఎంపిక చేశారు. త్వరలో మిషన్ డైరెక్టర్ను నియమించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ వర్క్షాప్కు ఐబీఎం (IBM) టెక్నికల్ సపోర్ట్ అందిస్తుండగా, ఐటీ, ఫార్మా, హెల్త్, యూనివర్సిటీలు, స్టార్టప్ సంస్థలు, ఇన్నోవేటర్లు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ మిషన్ రాష్ట్రానికి భవిష్యత్తులో AI, Quantum Research, Innovation రంగాల్లో ముందంజ తీసుకురానుంది.