
తిరుపతి, జూన్ 7: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం భద్రతా వ్యవస్థను మరింత బలపరిచే దిశగా టిటిడి కీలక చర్యలు చేపట్టింది. అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఆదేశించారు. శనివారం టిటిడి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబరులో జరిగిన సమీక్షలో ఈవో మాట్లాడుతూ, భక్తుల సౌకర్యం, భద్రత లక్ష్యంగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, queue management, CC cameras, luggage scanning వంటి అంశాల్లో శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. వాహనాలు మరియు లగేజీ తక్కువ సమయంలో స్కానింగ్ కావడంతో భక్తులకు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ల మాదిరిగా luggage deposit వ్యవస్థను అందించాలన్న యోచనపై టిటిడి ఐటీ మరియు విజిలెన్స్ విభాగాలకు దిశానిర్దేశం చేశారు.
దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని అలిపిరికి తరలించిన విషయాన్ని కూడా ఈవో వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు టోకెన్లను ప్రత్యక్షంగా అందించాలన్న ఉద్దేశంతో, భూదేవి కాంప్లెక్స్ లో రోజుకు 5,000 టోకెన్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసం రవాణా, భద్రత, టోకెన్ల జారీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో కూడా టోకెన్ల జారీకి ఆర్కియాలజీ శాఖ అనుమతుల కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈవో స్వయంగా భూదేవి కాంప్లెక్స్ లో భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులు టోకెన్ల జారీ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అలిపిరి టోల్ ప్లాజా ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం, luggage scanning కేంద్రంలోని సిబ్బందితో టిటిడి ఈవో చర్చించారు. పరికరాల పనితీరును పరిశీలించి భద్రతా ప్రమాణాలను బలపర్చే సూచనలు ఇచ్చారు. భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ల జారీ విధానాన్ని స్వయంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో వీరబ్రహ్మం, సివిఅండ్ ఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ హర్షవర్థన్ రాజు, సిఈ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.