పేదల భూములపైనే రేవంత్ కన్ను: Harish Rao సంచలన వ్యాఖ్యలు
పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి Harish Raoను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను లాక్కోవడమే ధ్యేయంగా పెట్టుకుందని, అభివృద్ధి పేరుతో వేలాది ఎకరాల సాగు భూములను హస్తగతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే పోలీసులను ప్రయోగిస్తున్నారని Harish Rao విమర్శించారు.
రెండు మూడు పంటలు పండే పచ్చని భూములను పరిశ్రమల కోసం కేటాయించడం దారుణమని, రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. కాళ్లాపూర్, రాపోలు ప్రాంతాల్లో భూసేకరణ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసుల నిర్బంధంపై ధ్వజం శాంతియుతంగా బాధితులను కలిసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం దౌర్జన్యమని Harish Rao అన్నారు. తమను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయట పెట్టుకుంటోందని, ప్రజల సమస్యలపై మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, బయట అరెస్టులు చేయడం వంటివి రేవంత్ సర్కార్ వినాశనానికి నాంది అని ఆయన హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి పాలన అంతా బోగస్ హామీలతో సాగుతోందని, ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారని హరీష్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని, మళ్ళీ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో రామరాజ్యం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
