April 1, 2026

ఒంటిమిట్టలో కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం!

CM CHANDRA BABU (ONTIMITTA)

CM CHANDRA BABU (ONTIMITTA)

కడప జిల్లాలోని ఏకశిలా నగరం ఒంటిమిట్ట బుధవారం రామనామ స్మరణతో మారుమోగింది. శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా, అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయత్వం చెందారు.

సాయంత్రం 6 గంటలకు ‘కాంతకోరిక’ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించి, రాత్రి 7 గంటలకు ప్రధాన కల్యాణ ఘట్టాన్ని అర్చకులు ప్రారంభించారు. పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, కన్యావరణం వంటి క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. మహాసంకల్పం అనంతరం సీతారామచంద్రుల ప్రవరలను పఠించి, జీలకర్ర బెల్లం ఉంచి మాంగళ్యధారణ కావించారు.

కల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులందరికీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని, ముత్యాలతో కూడిన తలంబ్రాలను టీటీడీ పంపిణీ చేసింది. ఈ అపురూప ఘట్టాన్ని ఎస్వీబీసీ (SVBC) ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించారు.

ఈ వేడుకలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

#Ontimitta #SitaRamaKalyanam #SriRamaNavami #TTD #Kadapa #SpiritualIndia #KodandaramaSwamy #BreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *