‘ఎస్వీబీసీ’ ఇక ఫుల్ హెచ్ డీతో ప్రసారాలు: ఈవో
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారాలను అందించాలని అధికారులను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఎస్వీబీసీ కార్యక్రమాలు మరింత నాణ్యంగా అందించేందుకు ఎస్వీబీసీ హెచ్డీ ఛానల్ అప్లింకింగ్ , డౌన్లింకింగ్ కోసం అదనపు ఉపగ్రహ బ్యాండ్విడ్త్ కేటాయింపునకు సంబంధించి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలకు అవసరమైన దరఖాస్తులు చేయాలని సూచించారు. హెచ్ డీ ఛానల్ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా, ఎస్వీబీసీ ఛానల్ లో ఇప్పటి వరకు గంటకు స్పాన్సర్డ్ స్పాట్ లు 12 సెకన్లు మాత్రమే ఇస్తున్నారని, వాటిని 60 సెకన్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు స్విమ్స్ లో సాధారణ వైద్య చికిత్సలు, అరవింద్ ఐ హాస్పెటల్ లో కంటి వైద్య చికిత్సల కోసం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఎస్వీబీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు.
టిటిడిలో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న అవాద్ బిన్ మొహ్సిన్ సనాజీ, ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న ఎం.డి. ఖైసర్ పాషాలు వారి రికార్డుల్లో ముస్లిం వర్గాలుగా నమోదైనందున వారి కాంట్రాక్ట్ గడువు 31.12.2025తో ముగిసిన అనంతరం వారి సేవలను కొనసాగించరాదని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీబీసీ బోర్డు సభ్యులు బీ.ఆనందసాయి, ఎం.ఎస్. రాజులు వర్చువల్ గా పాల్గొనగా, ఎస్వీబీసీ ఇంఛార్జి సీఈవో డి. పణికుమార్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
