
- హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం..రండీ.. కదలిరండీ..
- వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపు
విద్యార్థులకు వెన్నపోటు.., తల్లులకు వెన్నుపోటు…, రైతులకు వెన్నుపోటు.. నిరుద్యోగులకు వెన్నపోటు.., మహిళలకు వెన్నుపోటు…, ఉద్యోగులకు వెన్నుపోటు.. కూటమి ప్రభుత్వం నమ్మి ఓట్లేసిన జనాన్ని అడుగడుగునా పోట్లు పొడుస్తూనే ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఆయన తూర్పారబట్టారు.
రాయచోటి ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రైతుల పంటల సాగుకు భరోసా ఇవ్వకు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయక వారిని వెన్నుపోటు పొడిచారని, విద్యార్థులను కల్పించాల్సిన వసతులు ఇవ్వక, తల్లికి వందనం అమలుచేయక, యువతకు నిరుద్యోగభృతి ఇవ్వక నోరు తెరవనివ్వకుండానే వెన్నుపోటు పొడిచారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు.
జనం నెత్తిన అప్పుల కుప్పలు
ఏడాది కాలంలోనే రూ 1.50 లక్షల కోట్లును కూటమి ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ పెన్షన్ తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. వాటిని భరించాల్సింది జనమేకదా? అని అన్నారు. గత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే 90 శాతం హామీలను అమలు చేసి అప్పటి సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారన్నారు. ఆయన ఇచ్చే అన్ని పథకాలపై ‘నీకు పదిహేను… నీకు పదిహేను వేలు.. నీకు 18 వేలని, ఎందరికంటే అన్ని పదిహేను వేలు ’ అని చెప్పిన చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ‘ఖజానా ఖాళీ.. కడుపు తరక్కుపోతోంది’ అంటూ వెన్నుపోటు సిద్ధాంతాన్ని సమర్థించుకుంటున్నారని విరుచుపడ్డారు.
జూన్ 4న ప్రజల గొంతుకై… నిరసిద్దాం..
అందుకే తమ పార్టీ ప్రజల గొంతుకై వారి తరపున పోరాటానికి సిద్ధమవుతోందని అన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన పథకాల లబ్దిని తక్షణం అందించాలని డిమాండ్ చేస్తూ ‘వెన్నుపోటు దినం’నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా జూన్ 4 వ తేదీ బుధవారం ఉదయం 9.30 గంటలకు రాయచోటి పట్టణములోని కడప రహదారి మార్గం రింగ్ రోడ్ -అన్నమయ్య సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందచేయడం జరుగుతుందన్నారు.
నియోజక వర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,అనుబంధ సంఘాల సభ్యులు,శ్రేణులు, ప్రజలు, తరలి వచ్చి వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి తదితర వైఎస్ఆర్ సిపి నేతలు హాజరు కానున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.