
ముగ్గురు మిత్రులు బైక్పై వెళ్తుండగా రోడ్డుపై బ్యాగ్ దొరికింది.. తెరిచి చూస్తే.. ఆశ్చర్యం. నిండా నగలు, డబ్బుల కట్టలు.. ఆ క్షణంలో చాలా మంది మదిలో మెదిలేంటి? వాటిని దాచుకోవాలని.. వాడుకోవాలని… కానీ, ఈ ముగ్గు మిత్రులు ఏం చేశారో తెలిస్తే అవునా! నిజమా! అలా చేశారా? అంటారు. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి.
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా, జూన్ 12: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ముగ్గురు యువకులు – సోహెల్, వలి, నరసింహులు పని నిమిత్తం బైక్పై ఎమ్మిగనూరు నుండి ఆదోని వెళ్తుండగా మార్గమధ్యంలో నడి రోడ్డుపై ఒక బ్యాగ్ కనిపించింది. బ్యాగును తెరిచి చూసి ఆశ్చర్యపోయారు.
డబ్బులు, నగలతో నిండిన బ్యాగ్
యువకులు బ్యాగ్ను ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో 415 గ్రాముల బంగారు ఆభరణాలు, 120 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 2.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ విలువ గల వస్తువులను ఒక్కక్షణం కూడా తమ వద్ద పెట్టుకోకుండా వెంటనే పోలీసులకు అప్పగించడం నిజాయితీకి నిదర్శనంగా నిలిచింది.
బ్యాగ్ను కోల్పోయిన మహిళ ఆనందం
పోలీసులు విచారణ చేపట్టగా, నందవరం మండలానికి చెందిన ఓ RMP డాక్టర్ భార్య లలిత తన ఆటోలో ప్రయాణిస్తుండగా బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించారు. ఆమె స్టేషన్కు వచ్చి బ్యాగ్లో ఉన్న వస్తువులు అన్ని సురక్షితంగా ఉండటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఐ శ్రీనివాసులు బ్యాగ్ను బాధితురాలికి అప్పగించారు.
అభినందనలు, కృతజ్ఞతలు
ఈ సందర్భంగా సోహెల్, వలి, నరసింహులను పోలీసులు ప్రశంసలు చేస్తూ అభినందించారు. బాధితులు కూడా వీరి నిజాయితీపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన మానవత్వం ఇంకా మనుషుల్లో బతికే ఉందని, సమాజంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారని చాటిచెప్పింది.