
విశాఖపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యోగా శిక్షణ అందించేందుకు రెండు ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు మంగళవారం విశాఖపట్నంలోని సాగరిక హాల్ వేదికగా జరిగిన సమీక్ష సమావేశంలో మార్పిడి అయ్యాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. సంబంధిత సంస్థల అధికారులతో పాటు ఆయుష్ విభాగం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ ఒప్పందాల్లో ఒకటి కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (IIITDM) సంస్థతో కాగా, మరొకటి మహారాష్ట్రకు చెందిన హాబిల్డ్ హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరింది. IIITDM తరఫున ఆచార్యులు కృష్ణనాయక్, ఎం. నరేశ్ బాబు, హాబిల్డ్ సంస్థ తరఫున అన్సుల్ అగర్వాల్ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
AI ఆధారంగా రూపొందించిన యాప్ ద్వారా యోగా శిక్షణ ఇవ్వడం, అలాగే 21 రోజుల పాటు ప్రత్యేక కోర్సు రూపంలో ఆన్లైన్ ద్వారా ఉచిత యోగా శిక్షణ అందించేందుకు సాంకేతిక పద్ధతులు అభివృద్ధి చేయనున్నారు. ఈ శిక్షణలు జూన్ 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమాలకు ముందస్తు భాగంగా ఉన్నాయి.