
-
జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల విద్యా సంస్థల్లో అమలు
-
వైఎస్సార్ ప్రభుత్వ అప్పులతో రాష్ట్రాన్ని దివాలాకొట్టించింది: నాదెండ్ల మనోహర్
విజయవాడ, జూన్ 2
రాష్ట్రంలోని విద్యార్థులకు రుచికరమైన, పోషకాహార భోజనం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 41 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్కు సుమారు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేయనున్నట్టు ఆయన చెప్పారు. “ఈ బియ్యం పండించిన అన్నదాత చేతుల మీదుగానే విద్యా సంస్థలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. రైతుకు గౌరవం ఇవ్వడం, విద్యార్థికి పోషణ కల్పించడం అనే ద్వైత ప్రయోజనంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది,” అని మంత్రి వివరించారు.
అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలంలోని కొడాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలన మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్, రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వ విధానాలను వివరించారు. తోట కనకదుర్గ రాజశేఖర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా, అత్తలూరి గోపిచంద్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “వర్షాభావం, ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను తక్షణంగా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు ప్రభుత్వాన్ని కోరినా, వైసీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రైతులపై ఒత్తిడి తేవడమే కాకుండా, వారికిష్టమైన మిల్లులకు మాత్రమే ధాన్యం విక్రయించాలన్నట్టు వ్యవహరించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు సంవత్సరాల తరబడి చెల్లించకుండా వేధించారు,” అని మండిపడ్డారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు. “ఐదేళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా కొనసాగించేందుకు ఇప్పటి ప్రభుత్వం కృషి చేస్తోంది,” అని నాదెండ్ల స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వం విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా వచ్చే జూన్ 4న ‘సుపరిపాలన మొదలై ఏడాది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్టు నాదెండ్ల తెలిపారు. ఉదయం మహిళలు రంగవల్లులు వేసి పండుగలా జరుపుకుంటే, సాయంత్రం యువత దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను ఆయన విడుదల చేశారు.