
హైదరాబాద్, జూన్ 06, 2025: తెలంగాణలో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల (MLAs) పనితీరు సరిగా లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని, లేకపోతే కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని సూచించారు.
పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారంలో ఉన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ సమర్థవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి (Booth Level) వరకు పార్టీ నిర్మాణం జరగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని, కార్యకర్తలు నిరాశగా ఉన్నారని, వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఉద్యోగాలు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అయితే ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదని మహేష్ గౌడ్ అన్నారు. జూన్ మాసంలో పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శాస్త్రీయబద్ధంగా కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.