
- ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ – హరీష్ స్పష్టత
- బనకచర్లపై బీజేపీ, కాంగ్రెస్లను ఆగ్రహంగా ప్రశ్నించిన హరీష్
హైదరాబాద్, జూన్ 2:
తెలంగాణ బీజేపీతో బీఆర్ఎస్ కలయికవుతున్నట్టు వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గట్టి సందేశం ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, “బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందన్నది కేవలం ఊహాగానమే. పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోదు. కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు..
ఒంటరిగానే పోటీ చేస్తుంది.100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తది.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/rKONCc6BuE
— BRS Party (@BRSparty) June 2, 2025
పోలీసులకు వార్నింగ్ – రెడ్బుక్ హెచ్చరిక
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న అధికారులపై తీవ్రంగా స్పందించిన హరీష్ రావు, “ఇలా వేధిస్తే రెడ్బుక్లో వారి పేర్లు నమోదవుతాయి. జాగ్రత్తగా ఉండాలి – రాబోయే రోజుల్లో మళ్లీ మేమే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం” అంటూ హెచ్చరించారు. మిల్లీ మ్యాగీపై అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్సీ, చైర్మన్లపై కూడా సీసీటీవీ ఫుటేజ్లు విడుదల చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక, అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయం ఉన్నప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్లో సమీక్షలు ఎందుకు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
బనకచర్లపై బీజేపీ, కాంగ్రెస్లను తప్పుబట్టిన హరీష్
చంద్రబాబుతో బీజేపీ ఒప్పందం కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించిన హరీష్ రావు, ఇప్పుడు బనకచర్ల అనే మరో విషయంలో బీజేపీ అదే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రూ.12 వేల కోట్లతో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ను నాలుగు బడా కాంట్రాక్టర్లకే అప్పగించారని, ఇది పూర్తిగా అక్రమమని ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే, వెంటనే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని సవాల్ విసిరారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని, ఇది రాష్ట్రానికి శాపంగా మారుతోందని అన్నారు.
రెవంత్ ప్రభుత్వం వైఫల్యం – సుప్రీంకోర్టుకూ వెళ్తాం
బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా ఈ ప్రాజెక్టును ఆపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని పునరుద్ఘాటించారు.