
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగింది.
ముందుగా ఉదయం పల్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ ఉదయం 8.00 – 9.30 గం.ల మధ్య స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గల పి.ఆర్.తోటకు వేంచేశారు.
సాయంత్రం 4.30 – 6.00 గంటల మధ్య శ్రీవారి ఉభయ నాంచారులతో బంగారు తిరుచ్చి నందు చక్రత్తాళ్వార్ చక్రపల్లకీలో ఊరేగింపుగా పి.ఆర్.గార్డెన్స్ నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి వేంచేస్తారు. అనంతరం రాత్రి 07.00 – 8.30 గం.ల మధ్య శ్రీవారి ఉభయ నాంచారులతో బంగారు తిరుచ్చినందు చక్రత్తాళ్వార్ లతో నాలుగు మాఢ వీధులలో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8.40 – 9.30 గం.ల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.