
- తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత స్పందన
- రౌడీషీటర్ల చర్యలకు కౌంటర్గా పోలీసులు
విజయవాడ,జూన్ 2 :
రౌడీ షీటర్లను కొట్టడాన్ని తప్పు అని ఎందుకు అనాలి? వారి విధ్వంసక చర్యల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటే తప్పేంటి? అంటూ ఏపీ హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెనాలిలో గంజాయి సరఫరా చేస్తున్న రౌడీ షీటర్లపై పోలీసులు లాఠీదండన చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత, “రౌడీషీటర్లు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. గంజాయి బ్యాచ్ సభ్యులుగా గుర్తింపు పొందినవారు పోలీసులను చితక్కొట్టారు. అందుకే వారిని కట్టడి చేసేందుకు పోలీసులు మార్జినల్ యాక్షన్ తీసుకున్నారు,” అని పేర్కొన్నారు. ఈ వీడియోపై వచ్చిన విమర్శల మధ్య ఆమె మాట్లాడుతూ, “పోలీసులు ఏమీ చేయకుండా చూస్తే కూర్చోరు, ఒక స్టెప్ ముందుకెళ్తే విమర్శలు వస్తున్నాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఈ చర్యను సమర్ధిస్తూ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు మానవహక్కుల వర్గాల్లో మరియు ప్రజా వేదికల్లో విమర్శలకు తావివ్వనున్నాయి. “చట్ట ప్రకారం శిక్షించాలి కానీ, రోడ్డుపై అందరూ చూస్తుండగా కొట్టడం సబబేనా?” అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి చర్యలకు ప్రోత్సాహం లభిస్తే, పోలీసులు రెచ్చిపోతారన్న చర్చ ఊపందుకుంటోంది.