April 5, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల సెగ.. బీ అలర్ట్!

SUMMER

SUMMER

ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుందని అధికారులు వెల్లడించారు.

శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యధికంగా వడగాలుల ప్రభావం ఉండనుంది. శ్రీకాకుళంలో 16, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 15 మండలాల్లో తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. ఆదివారం సైతం మరో 32 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది.

అమరావతిపై చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు: సజ్జల ఈ వార్తను కూడా చదవండి

శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో అత్యధికంగా 41.8°C ఉష్ణోగ్రత రికార్డవ్వగా, చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4°C నమోదైంది. అనకాపల్లి, శ్రీకాకుళం, నంద్యాల, కడప జిల్లాల్లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఎండల తీవ్రత దృష్ట్యా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి దాహంగా లేకపోయినా మంచినీరు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ (ORS) తో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు తీసుకోవడం శ్రేయస్కరమని అధికారులు పేర్కొన్నారు. ఎండలో ప్రయాణించే వారు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

#APHeatwave #SummerAlert #AndhraPradesh #WeatherUpdate #StayHydrated #HeatwaveSafety #NorthAndhra #ExtremeHeat

అమరావతిపై చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు: సజ్జల ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *